25-03-2025 12:32:59 AM
నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
యాదాద్రి భువనగిరి, మార్చి 24 (విజయక్రాంతి): డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి 15 మంది వ్యవసాయ కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితులకు పదేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు వెల్లడించింది.కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 సంవత్సరంలో ఆలూరు వెంకటనారాయణ, ధూళిపాళ్ల నాగేశ్వరరావులు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా 15 మంది వ్యవసాయ కార్మికులను ట్రాక్టర్లో మూసీ నది దాటుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ట్రాక్టర్ నీటిలో మునిగి అందులో ప్రయాణిస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోగా 17 మంది శతగాత్రులయ్యారు.
ఈ సంఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. బాధి తుల ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీస్ స్టేషన్లో వెంకట్ నారాయణ ఏ1 గా, నాగేశ్వరరావుల పై ఏ 2 గా కేసు నమోదయింది. నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన గుంటూరు జిల్లా వాసులు. నిందితులపై అప్పటి వలిగొండ ఎస్సై పకడ్బందీ సాక్షాలతో పలు రకాల కేసులు నమోదు చేసి నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టుకు సమర్పించారు. 7 ఏళ్ల సుదీర్ఘ కాలం అనంతరం న్యాయమూర్తి నిందితులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.