calender_icon.png 4 March, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు

03-03-2025 09:03:32 PM

ముస్తాబైన ఆలయం..

బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి..

భక్తులకు అన్నదానం ఏర్పాట్లు..

బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దశమ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముస్తాబ్ చేశారు. ఈ నెల ఐదు నుంచి 9 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దశమ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి దశమ బ్రహ్మోత్సవాలను మంగళవారం ప్రారంభించనున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు ఆలయాన్ని తెలంగాణలో అతిపెద్ద దేవాలయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశారు.

అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పని చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎంతో అద్భుతంగా 60 ఎకరాల స్థలంలో తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంను కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో గుట్టపై నిర్మించారు. ఆలయం వరకు తారు రోడ్లను సిమెంట్ మెట్లను నిర్మించి గుట్టపైకి బైకులు, కార్లు, బస్సులు, వెళ్లే విధంగా కొండపైకి భక్తులు కాలి నడకన నడుచుకుంటూ వెళ్లే విధంగా కూడా మెట్లు ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా తెలంగాణ తిరుమల తిరుపతి గా తిమ్మాపూర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వా నిధులను మంజూరు చేయించి నిర్మించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దశమ బ్రహ్మోత్సవాలు..

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం తిమ్మాపూర్ వద్ద నిర్మించిన తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం దశమ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు కామారెడ్డి నిజామాబాద్ జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని హైదరాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈనెల 4న మంగళవారం ఉదయం విష్ణు సహస్ర పారాయణంతో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రారంభమై ఉత్సవాలు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 7న శ్రీ లక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

మాడవీధులలో స్వామివారి ఊరేగింపులు వంటి వాటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దశమ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటులు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలు ఈనెల తొమ్మిదిన ముగియనున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మాడవీధుల్లో స్వామివారి పల్లకి సేవలో పాల్గొంటారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, తిమ్మాపూర్, గ్రామస్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు సేవలందించనున్నారు. కోనేరు తో పాటు గరుడ స్వామి. శ్రీనివాసులు, లక్ష్మీదేవి, పద్మావతి ,గోదాదేవి ఆలయాలు ఉన్నాయి. భక్తుల భోజనాలకు అన్న సత్రంతో పాటు భక్తులు ఉండేందుకు వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

ఉత్సవాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం..

బాన్స్వాడ నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాలు తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఉత్సవాలు జరిగే రోజులు ప్రత్యేకంగా నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్తలు పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శంభు రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొనడంతో పాటు భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరరావు కోరారు.