calender_icon.png 23 October, 2024 | 2:57 PM

నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచనం లభించిన రోజు

17-09-2024 02:13:55 PM

బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి

సిద్దిపేట,(విజయక్రాంతి): సెప్టెంబరు 17 నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచనం లభించిన రోజని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. విమోచన దినం సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారని, అనేక బలిదానాలు, త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు.

నిజాం రజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైందన్నారు. గత మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.

తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు కోడూరి నరేష్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు శివకుమార్, సంతోష్,శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, రాహుల్, సునీల్, దేవేందర్, మోతుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.