మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యుల వైఫల్యంతోని తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మండిచేయి చూపిందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు నందిపాటి రాజు ఆరోపించారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ పాలనకు నిదర్శనం బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్ సామాన్యునికి చేయూతను ఇవ్వాల్సింది పోయి పేదరికంలో నెట్టే విధంగా ఉందని మండిపడ్డారు. చిన్న ఉద్యోగాలు చేసే వారిపై వార్షికాదాయం 12 లక్షలు దాటితే ఐటి పంజా వేసి వారి జీవితాలను కుదేలు చేస్తుందనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా పరిపాలనను కొనసాగిస్తే దేశం మారదనీ సామాన్యుల జీవితాలు మారవని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ నినాదానికి పరిమితం కాకుండా చేతల్లో కూడా చూపించాలనీ ఆయన కోరారు. రాష్ట్రప్రభుత్వం, ఎంపీలు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు అందించకపోవడం సిగ్గుచేటనీ విమర్శించారు. భారత రాజ్యాంగంలో పొందు పరిచిన విధంగా ప్రతి పౌరునికి సమాన అవకాశాలు, సమాన హక్కులు బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు అందించాలనీ ఆయన డిమాండ్ చేశారు.