రాష్ట్రంలో స్టార్టప్ అనుకూల వాతావరణం
సెమీ కండక్టర్ యూనిట్లను స్థాపించాలి
టీ-ఫైబర్ ప్రాజెక్ట్కు సహకరించండి
టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డుజేషన్ అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): వచ్చే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పది బిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ప్రముఖంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దేశంలో స్మార్ట్ ఫోన్లు, విద్యుత్ వాహనాలు, ఇంటర్నెట్ కనెక్షన్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సెమీ కండక్టర్ అవసరాలు విస్తృతమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగదారులు 100 కోట్లకు, విద్యుత్ వాహనాలు కోటికి, ఇంటర్నెట్ కనెక్షన్లు 200 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు.
ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ప్రపంచ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డుజేషన్ అసెంబ్లీ- 2024 సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు ప్రసంగించారు. ఇందులో ముఖ్య అతిథులుగా కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని పాల్గొన్నారు.
సమావేశానికి పలు రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణలో స్టార్టప్ అనుకూల వాతావరణం కల్పించామని, మౌలిక వసతుల విషయంలో అగ్రగామిగా ఉన్నామని తెలిపారు.
సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ నాయకత్వం..
తెలంగాణలో ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు కార్యాలయాలు నెలకొల్పాయని వివరించారు. ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ కింద అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ యూనిట్లను తెలంగాణలో స్థాపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
కృతిమ మేథ(ఏఐ), సెమీ కండక్టర్ రంగాల్లో నైపుణ్యం ఉన్న 3.5 లక్షల మంది ప్రతిభావంతులు ఉన్నందున తెలంగాణకు ప్రాధాన్యత నివ్వాలని ఆయన కోరారు. సెమీ కండక్టర్ రంగంలో తెలంగాణ దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్విడియా, క్వాల్కామ్, బ్రామ్కామ్ వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు, గ్లోబల్, లోకల్ మార్కెట్ల కోసం పనిచేసే స్టార్టప్లతో ముందుకు దూసుకెళ్తున్నామని వెల్లడించారు.
టీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలు కోసం కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని 80 లక్షల కుటుంబాలకు హైస్పీడ్ ఇంటర్నెట్, మల్టీప్లే సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సేవలను నెలకు కేవలం రూ.300 లకే ఇవ్వడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఐటీ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలుగుతామని చెప్పారు.
డిజిటల్ కనెక్టివిటీ అంటే కేవలం ఇంటర్నెట్ అందించడం మాత్రమే కాదని, ఇది గ్రామీణ వ్యాపార వృద్ధి, విద్య, వైద్య సేవల లభ్యతను మరింతగా పెంచడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అవుతుందని ఆయ అన్నారు.