calender_icon.png 27 October, 2024 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు గుండు సున్నానే

24-07-2024 12:56:56 AM

  1. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం పేరునూ ప్రస్తావించలేదు
  2. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ కరుణించలేదు
  3. విభజన చట్టం హామీలపై కేసీఆర్ కోరినా స్పందించలేదు
  4. బీహార్, ఏపీలకు మాత్రమే బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు 
  5. కేంద్ర పద్దుపై కేటీఆర్ ధ్వజం

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): తెలుగు కోడలు కావడంతో బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు భారీగా కేటాయిస్తారని భావిస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిరాశపరిచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని, బడ్జెట్ మొత్తంలో తెలంగాణ పేరు సైతం ప్రస్తావన రాకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ప్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఊసే లేదని, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు. ఐఐఎం సహా కేంద్ర విద్యా సంస్థలను ఇవ్వమని కోరినప్పటికీ మొండి చెయ్యి చూపించారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ముంబై బెంగళూ రు వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడినప్పటికీ స్పందన లేదన్నారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. తెలంగాణ సీఎం, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటినీ పట్టించుకోలేదన్నారు. 

స్థానిక పార్టీయే శ్రీరామరక్ష

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని, 16 స్థానాలున్న ఏపీ, బీహార్‌కు దక్కిన నిధులను చూసి తెలంగాణ మరోసారి ఆలోచించాలన్నారు.  స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రాంతీయ శక్తులను ఎందుకు బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన తెలియజేస్తోందని, పార్లమెంటులో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు ఒక్కమాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంటులో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వినిపించేవారని తెలిపారు.

8 మంది ఎంపీలు ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీకి నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఎలాంటి బాధలేదని, సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులపై, వారు బాగుండాలని కోరుకుంటు న్నామన్నారు. ఏపీ పునర్విభజన చట్టం పేరు చెప్పినా ఎక్కడా తెలంగాణ అనే పదం ప్రస్తావించలేదని, రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని మాత్రమే చెప్పారని విమర్శించారు. ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్‌కు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారని తెలిపారు. బీహార్, ఏపీలకు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు.