calender_icon.png 9 March, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

07-03-2025 10:41:43 AM

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు(RTC employees) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డిఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2.5 శాతం డిఏ వల్ల ఆర్టీసీ పై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(For Minister Ponnam Prabhakar) తెలిపారు. మహా లక్ష్మి పథకం ప్రారంభం తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం అభినందించారు. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఆయన సూచించారు. మహిళా ప్రయాణికుల అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందన్నారు. మహిళా సమైక్య సంఘాల చేతే బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి మహిళలు ఆదాయాన్ని అర్జించాలని భావించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)తో పాటు అధికారులతో పలుమార్లు చర్చించిన విషయం తెలిసిందే. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టీ బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చిందన్నారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి  ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరగగా రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు.  ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా  సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య ల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డిమాండ్ ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.