27-04-2025 01:02:25 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కృత్రిమ మేధస్సు, డ్రోన్లు, జియోగ్రాఫిక్ సమాచారంతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నీటిపారుదల రంగాన్ని ఆధునీకరిం చనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
హెచ్ఐసీసీలో శనివారం జరిగిన డ్రోన్ ఎక్స్పో సదస్సు 2025 కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంతోపాటు సుస్థిరమైన గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందన్నారు. సాగునీటి రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. నీళ్లు, భూమి మేనేజ్మెంట్ శిక్షణ పరిశోధన సంస్థను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.
ఆధునిక నీటినిర్వహణ, సాగునీటి పద్ధతులపై పరిశోధనలో శిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోబోతున్నామన్నారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం మీదనే ఆధారపడకుండా డ్రోన్ ఎక్స్పో లాంటి సదస్సులతో స్టార్ట్ప్లు, విద్యాసంస్థలు, పారిశ్రామికవేత్తలు తదితరులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పరస్పరం సమన్వయం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చన్నారు.
ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషించకుండా వినూత్న అంశాలపై దృష్టి సారించాలని యువతకు పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా చేయూతనందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకు నేందుకు పారిశ్రామికవేత్తలు, స్టార ప్ కంపెనీలు, విద్యాసంస్థలు ముం దుకురావాలన్నారు.