08-02-2025 01:30:34 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 7: సాంకేతిక లోపంతో స్పైస్ జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయింది. దీంతో ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన 180 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారిలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులతో పాటు సినీ నటుడు విజయ్ దేవర కొండ కూడా ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉదయం 9 గంటలకు స్పైస్ జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్ బయలుదేరాల్సి ఉంది. విమానం ఎంతకూ టేకాఫ్ కాలేదు. సాంకేతిక లోపంతో విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు కాస్త ఆలస్యంగా వెల్లడించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ విమానంలో ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు యువ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. తాము రూ.30 వేల చొప్పున ఖర్చు చేసి టికెట్లు కొనుగోలు చేశామని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటామని విమానాల్లో ప్రయాణం ప్లాన్ చేసుకుంటే ఇప్పుడేమో సాంకేతిక లోపమంటూ రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.