05-04-2025 12:15:59 AM
దాశరథి ఉత్సవాల్లో భాగంగా ‘ఆ చల్లని సముద్ర గర్భం’ దృశ్యగీతావిష్కరణ సభలో కవిత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : కంచ గచ్చిబౌళి భూముల్లో నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం దాశరథి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ దృశ్యగీతావిష్కరణకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణలో 7.7శాతం అడవులు పెరిగాయన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో చెట్లు నరికేసే పాలన సాగుతోందని విమర్శించారు. నిజాం రాజు ఎన్ని హింసలు పెట్టినా దాశరథి తెలంగాణ వాదాన్ని వదలలేదని కొనియడారు. ప్రతీ ప్రజా ఉద్యమంలో పాల్పంచుకున్న గొప్ప వ్యక్తి దాశరథి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన రచనలు స్ఫూర్తినిచ్చాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని, తెలంగాణ కోణంలో పరిపాలన జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.