10-04-2025 01:22:35 AM
ఎల్బీనగర్ క్యాంపు ఆఫీసులో నిందితులకు కౌన్సిలింగ్
నెల రోజుల్లో 203 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్
ఎల్బీనగర్, ఏప్రిల్ 9 : బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు కోరారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు.
బాలికలు, మహిళలను వెంబడించి, వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరుపరుస్తూ.. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు అన్నారు.రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు బుధవారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాచకొండ కమిషనరేట్ లో మహిళలు, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 203 (మేజర్స్-138 ,మైనర్స్-65) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వీరికి ఎల్బీనగర్ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసులో కౌన్సిలర్ల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల 1 నుంచి 31 తేదీ వరకు 249 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.ఫోన్ల ద్వారా వేధించినవి -30, సోషల్ మీడియా ద్వారా ద్వారా వేధించినవి-87 , నేరుగా వేధించినవి 132.వాటిలో క్రిమినల్ కేసులు-14, పెట్టి కేసులు- 84 ఉండగా , 116 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి తెలిపారు.