25-01-2025 12:00:00 AM
పెగట్రాన్లో మెజారిటీ వాటా కొనుగోలు
ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీలో టాటా గ్రూప్ తన దూకుడును కొనసాగిస్తోంది. గతంలో ఐఫోన్లు తయారుచేసే విస్ట్రన్ కార్పొరేషన్కు చెందిన భారత వ్యాపారాన్ని సొంతం చేసుకున్న ఆ కంపెనీ.. ఏడాది తిరగకముందే మరో కంపెనీలో మెజారిటీ వాటా దక్కించుకుది.
తైవాన్కు చెందిన పెగట్రాన్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ పెగట్రాన్ ఇండియాలో 60 శాతం మెజారిటీ వాటాను టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ దక్కించుకుంది. ఈ కొనుగోలు దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో టాటా ఎలక్ట్రానిక్స్ను మరింత ఉన్నత స్థానంలో నిలుపుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
పెగట్రాన్ ఇండియాలో మెజారిటీ వాటాను టాటా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇరు సంస్థలు కలిసి కట్టుగా పనిచేయడంపై దృష్టిసారించనున్నామని టాటా ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో టాటా ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఈ వ్యూహాత్మక కొనుగోలు దోహదం చేస్తుందని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈఓ, ఎండీ రణ్ధీర్ ఠాకూర్ తెలిపారు.