28-03-2025 01:39:08 AM
జగిత్యాల అర్బన్, మార్చి 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో గురువారం సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. పలు రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానంతో రిటైర్డ్ ఎస్పి ప్రభాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని ఓ రైస్ మిల్లుతో పాటూ జిల్లాలోని మరికొన్ని రైస్ మిల్లుల్లో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. ఓ లారీలో రైస్ మిల్లుకు రేషన్ బియ్యం తరలిస్తుండగా, పక్కా సమాచారంతో అధికారులు వెంబడించి తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా సిరికొండలోని సదరు రైస్ మిల్లులో గత ఏడాది జరిగిన తనిఖీల్లో సుమారుగా రూ 80 కోట్ల ధాన్యం గల్లంతైనట్లు వెలుగు చూడడం గమనార్హం.