calender_icon.png 26 March, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ప్రయోజనం కొరకు టాసర్ రేషం కృషి మేళా

25-03-2025 10:29:07 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

చెన్నూర్ (విజయక్రాంతి): రైతుల ప్రయోజనం కొరకు ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రాంచీలోని సి.ఎస్.బి. సి.టి.ఆర్.టి.ఐ. సహకారంతో టాసర్ రేషం కృషి మేళా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూర్ లోని దసలి పట్టుగూళ్ళ నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభించిన అనంతరం మోడల్ కొకూన్ మార్కెట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జార్ఖండ్ రాంచీలో గల సి.టి.ఆర్., టి.ఐ. సంచాలకులు డాక్టర్ ఎన్.బాలాజీ చౌదరి, ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ లో గల బి.టి.ఎస్.ఎస్.ఓ. సంచాలకులు డాక్టర్ టి. సెల్వకుమార్, జిల్లా ఉద్యానవన, పట్టు శాఖ సంయుక్త సంచాలకులు ఎం. లత, వరంగల్ జిల్లా సంయుక్త సంచాలకులు జి. అనసూయలతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల ప్రయోజనం కొరకు 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డి.ఎం.ఎఫ్.టి. నిధుల క్రింద పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో దసలి పట్టుగూళ్ళ నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రైతు శ్రేయస్సులో భాగంగా టాసర్ రేషం కృషి మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. టాసర్ పట్టు సాధన చేసే రైతులను ప్రోత్సహిస్తూ పట్టు నూలు తయారీ, ఫ్యాబిక్ తయారీ అభివృద్ధి చేయాలని, తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు. ప్రభుత్వం నుండి సాధ్యమైన అన్ని సహాయాలను అందించడం జరుగుతుందని తెలిపారు.

టాసర్ హోస్ట్ ప్లాంట్ కొరకు పోడు భూములు, అటవీ భూములను ఉపయోగించుకోవాలని తెలిపారు. సెరికల్చర్, అటవీ శాఖల మధ్య ఉన్న భూసంబంధిత సమస్యల పరిష్కారం, టాసర్, వెదురు సాగు అభివృద్ధిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కార్యకలాపాలను సమర్థవంతంగా చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో టాసర్ ముడి పట్టు ఉత్పత్తిలో గత దశాబ్ద కాలంగా సైంటిస్ట్ డి ఎం.వి.కె. భగవానులు నేతృత్వంలోని బి.ఎస్.ఎం.టి.సి. చెన్నూర్ అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని అన్నారు. దేశంలోని అన్ని టాసర్ సెరికల్చర్ ప్రాక్టీస్ చేసే రాష్ట్రాలలో ఈ విత్తనానికి మంచి డిమాండ్ ఉందని, ఛత్తీస్ ఘడ్ బిలాస్పూర్ లోని అస్తిత్వ మహిళా సమితి సహకారంతో స్వయం సహాయక సంఘాల ద్వారా కార్యకలాపాలను ప్రారంభించాలని తెలిపారు.

టాసర్ సిల్క్ రీలింగ్ యంత్రాలతో పాటు ప్రత్యక్షంగా యంత్ర పనితీరును ప్రదర్శించారు. రాంచీలోని సి.టి.ఆర్.టి.ఐ., సి.ఎస్.బి. సంచాలకులు చెన్నూర్ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న అత్యుత్తమ నాణ్యత గల టాసర్ పట్టు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కోకన్ ఉత్పత్తి, టాసర్ గుడ్డు ఉత్పత్తిలో ఉత్తమ రైతులతో పాటు అధికారులు, త్వరలో పదవీ విరమణ పొందనున్న సెంట్రల్ సిల్క్ బోర్డ్- చెన్నూర్ ఎం. వి. కె. భగవానులు ను సత్కరించి, ధృవపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ ఎ.డి. రాథోడ్ పార్వతి, ములుగు ఆర్.ఎస్.ఆర్.ఎస్. డాక్టర్ జి.రాఘవేంద్ర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.