calender_icon.png 5 October, 2024 | 4:50 AM

టార్గెట్ ఒలింపిక్స్

05-10-2024 02:38:53 AM

  1. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ 
  2. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ

ఒకే గొడుగు కిందకు ప్రధాన స్టేడియాలు 

స్పోర్ట్స్ వర్సిటీకీ ప్రత్యేక బోర్డు, చైర్మన్ 

స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సీఎం రేవంత్ సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 04 (విజయక్రాంతి): 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త పాలసీలో ఒలింపిక్స్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అధికారులు తయారుచేసిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు. ముసాయిదా పవర్ పాయింట్ ప్రజంటేషన్లను పరిశీలించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై సీఎం కీలక సూచనలు చేశారు.

ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించినవారికి ఎంత ప్రోత్సాహకం ఇవ్వాలి? ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి? అనే అంశాలపై మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. క్రీడాకారులను తీర్చిదిద్దటంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీ ఉండాలన్నారు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ వర్సిటీని పీపీపీ మోడల్‌లో నిర్వహించాలన్నారు. దీని కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, చైర్మన్‌ను సైతం నియమించాలన్నారు.

అలాగే, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని దిశానిర్దేశం చేశారు. స్పోర్ట్స్ యూని వర్సిటీలో తొలుత 13 కోర్సులను నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత హాకీ, ఫుట్ బాల్, క్రికెట్, స్విమ్మింగ్, టెన్నిస్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, అక్వాటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్ లాంటి 14 క్రీడల స్పోర్ట్స్ కోర్సులను పొందుపరిచినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

గచ్చిబౌలి స్టేడియం అప్‌గ్రేడ్ 

హైదరాబాద్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియాలను స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తీసుకురావా లని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటివన్నింటినీ గుర్తించి..

ఒకే గొడుగు తీసుకొచ్చేం దుకు ప్రణాళికలు తయారుచేయాలన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని సూచించారు. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగు ణంగా వాటిని అధునాతనంగా అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. 

భౌగోళిక పరిస్థితులను బట్టే క్రీడలు 

తెలంగాణలో ఉన్న భౌగోళిక పరిస్థితులతోపాటు, ఇక్కడి యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమిచ్చేలా పాలసీ ఉండాలని సీఎం చెప్పారు. అవసరమైతే దేశ విదేశాల్లో ఉన్న కోచ్‌లను రప్పించి, అక్కడున్న యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంవో యూలు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ర్టవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించటం నుంచి వారికి చదువులకు ఆటంకం లేకుండా.. అటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని సీఎం సూచించారు.

సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడలు, యువజన అభ్యున్నతి శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు.