calender_icon.png 24 October, 2024 | 8:57 PM

పంద్రాగస్టు బరిలో తంగలాన్

20-07-2024 02:16:23 AM

పంద్రాగస్టు బరిలో మరో చిత్రం చేరిపోయింది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఆ సినిమానే ‘తంగలాన్’. విక్రమ్, పా రంజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తంగలాన్’. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేజీఎఫ్ గోల్డ్ మైన్స్‌ను బ్రిటీష్ వాళ్ల నుంచి తంగలాన్ అనే తెగ ఎలా కాపాడుకున్నారనేది ఈ చిత్రం లో చూపించనున్నారు.

దీంట్లో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. అయితే, స్వాతంత్య్ర వేడుకల ఆనందాన్ని సినీ ప్రేక్షకులకు మరింత రెట్టింపు చేసేందుకు ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధం కాగా, తాజాగా ఆ జాబితాలో ‘తంగలాన్’ చేరిపోయింది. పంద్రాగస్టు బరిలో రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ‘మిస్టర్ బచ్చన్’; రామ్ పోతినేని, పూరీజగన్నాథ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’; ప్రియదర్శి, నివేతా, ఎన్.కిషోర్ కాంబోలో ‘35 చిన్న కథ కాదు’; ఎన్.నితిన్, అంజిబాబు కాంబోలో ‘ఆయ్’ సినిమాలు రానున్నాయి.