“చావుని ఎదిరించే వాళ్ళకే ఇక్కడ జీవితం” అని హెచ్చరిస్తున్నారు హీరో విక్రమ్. ఆయన కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తంగలాన్’. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరమీదికి రానున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. బ్రిటీష్ పాలనా కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ సినిమా రానుంది. బ్రిటీష్ వారికి సహకరించే ఓ తెగ నాయకుడిగా కనపడనున్నారు విక్రమ్. ఆ కాలం నాటి వ్యక్తిగా ఆయన కనపడిన తీరుకి అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. సాహసవంతుడిగా విక్రమ్ చేసే పోరాటాలు, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.