calender_icon.png 7 October, 2024 | 4:51 PM

తమిళనాట జోరు

06-10-2024 12:00:00 AM

మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ భామగా పేరు తెచ్చుకున్న తెలుగందం కృతిశెట్టి. తర్వాత నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో ఇతర పరిశ్రమలపై దృష్టి పెట్టింది. ‘-ఏఆర్‌ఎం’ చిత్రంతో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టింది. అక్కడ తొలి సినిమాతోనే విజయాన్నందుకుంది.

పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి, ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదో చిత్రంగా ఘనతకెక్కడం కృతి కెరీర్‌ను మలుపు తిప్పినట్టయ్యింది. ఈ మూవీ మలయాళ వెర్షన్‌లో కృతిశెట్టి పాత్రకు ‘ప్రేమలు’ ఫేమ్ హీరోయిన్ మమితా బైజు డబ్బింగ్ చెప్పింది.

ఇలా మలయాళంలో హిట్టు కొట్టిన కృతి అటు తమిళంలోనూ హవా కొనసాగిస్తోంది. ఆమె చేతిలో ఇప్పుడు కోలీవుడ్ సినిమాలు మూడున్నాయి. ఇదిలా ఉండగా, తమిళ స్టార్ హీరో కార్తితోనూ కృతి జత కట్టునుందనేది తాజాగా అందుతున్న సమాచారం.

కార్తి ప్రధాన పాత్రలో నటించిన సినిమా తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ‘వా వాతియార్’లో హీరోగా నటించనున్నారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ చిత్రం డిసెంబర్ 26 లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉంది.