14-04-2025 05:10:32 PM
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘ఓదెల 2’. ఇందులో ఆమె మునుపెన్నడూచూడని క్యారెక్టర్లో అలరించడానికి సిద్ధంగా ఉంది. బ్లాక్బస్టర్ అయిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్గా రూపుదిద్దుకుంటోందీ సినిమా. ప్రముఖ ఫిలిం మేకర్ సంపత్ నంది సూపర్ విజన్లో అశోక్తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ పతాకంపై డీ మధు నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనుండగా.. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్లలో ఒకటిగా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది ‘ఓదెల2’. ఈ సందర్భంగా మూవీ క్రియేటర్ సంపత్ నంది సోమవారం హైదరాబాద్లో విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సినిమా విశేషాలివీ..
‘ఓదెల2’ ఐడియా ఎప్పుడు ప్రారంభమైంది?
తొలిభాగం చేసినప్పుడు సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు. ఏదైనా అవకాశం ఉంటే చేయొచ్చు కదా అని చివర్లో ఒక లీడ్ ఇచ్చాం అంతే. పార్ట్ వన్ తెలుగులో చాలా పెద్ద విజయాన్నందుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం ఆహా వారు తమిళ్ రేట్స్ కూడా కొనుక్కున్నారు. దీన్ని హిందీలో రీమేక్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. డైరెక్టర్ అశోక్ ఈ సినిమాకు సీక్వెల్ ఎందుకు రాయకూడదని అడిగారు. ఒకసారి భీమ్స్తో మ్యూజిక్ సిట్టింగ్స్కు వెళ్లాను. అప్పుడు ఆ మ్యూజిక్ సిటింగ్స్ అవ్వలేదు.. కానీ, ఈ సీక్వెల్ ఆలోచన అక్కడే క్రియేట్ అయింది.
తమన్నా క్యారెక్టర్ గురించి..?
మొదటి భాగంలో హెబ్బా పటేల్ చేసిన రాధ క్యారెక్టర్ హైలెట్ అయింది. రెండో భాగంలో కూడా ఒక ఫిమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే బాగుంటుందనుకున్నాం. ఫస్ట్ పార్ట్లో ఒక దుష్ట శక్తిని అంతం అవుతుంది. దాని ఆత్మను కంట్రోల్ చేయాలంటే మరో శక్తి కావాలి. శివశక్తి లాంటి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందని ఆలోచన పుట్టింది. తమన్నాతో ఇంతకుముందే రెండు సినిమాలు పనిచేశాను. తను చాలా మంచి పెర్ఫార్మర్.. ఈ క్యారెక్టర్కు తనే సరైన నటి అని చెప్పాను. తనకు కూడా చాలా నచ్చింది.
శివశక్తి పాత్ర గురించి వివరంగా చెప్తారా?
-ఈ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే.. సోల్ వర్సెస్ సూపర్ నేచురల్ పవర్స్. ఆత్మ వర్సెస్ పరమాత్మ. నేను శివశక్తి లాంటి క్యారెక్టర్లు మా ఊరి ప్రాంతాల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చూశాను. మా నాన్నమ్మ కూడా శివశక్తిగా ఉండేవారు. చిన్నప్పుడు తనకు పూనకం రావడం నేను చూశాను. తెలిసీ తెలియని వయసులో కామెడీ కూడా చేసుకునేవాళ్లం. నానమ్మ ఆ చుట్టుపక్కల చాలా పాపులర్. ఎవరికైనా కష్టం వస్తే వచ్చి చెప్పుకునేవాళ్లు. ఆ విజువల్స్ అన్నీ నాకింకా గుర్తున్నాయి. అది స్క్రీన్కు కొత్తగా ఉంటుందని భావించాను. శివసత్తులు నాగసాధువులుగా మారతారని, శివాలయాలను పునరుద్ధరణ చేస్తారని.. ఇలా చాలా సమాచారం తెలిసింది. అలా నాగసాధు క్యారెక్టర్ పుట్టింది.
తమన్నా నాగసాధు లుక్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు?
-మొదట మూడు లుక్స్ ట్రై చేశాం. తమన్నా చాలా ఫెయిర్గా ఉంటారు. నాగసాధులు ఎండల్లో ఉంటారు. ఆ స్కిన్ టోన్ వేరుగా ఉంటుంది. ఎన్ని మేకప్లు ట్రై చేసినా ఫేక్గా అనిపించేది. నాగసాధువుల్లో ఫారినర్స్ కూడా ఉన్నారు. తమన్నా ఎండల్లో ఉంటే పింకిష్గా మారతారు. అసలు మేకప్ లేకుండానే చేద్దామని అనుకున్నాం. డిజైనర్ నేతలుల్లాకు ఈ విషయం చెప్పాను. నేను రిఫరెన్స్గా తీసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ పంపించాను. ఆవిడ ఒక రెండు డిజైన్స్ వేశారు. ఫైనల్గా ఇప్పుడు చూస్తున్న లుక్ను ఓకే చేశాం. ఈ లుక్ను ప్రిపేర్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
-ఈ సినిమా కోసం తమన్నా ఎండలో చెప్పులు లేకుండా నటించారు. సినిమా పూర్తయ్యేదాకా పూర్తిగా శాకాహారిగా మారిపోయారు. తమన్నా స్విచ్యువల్ జర్నీలో ఉన్నారు కాబట్టే ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగారని నేను భావిస్తున్నాను. తను ఈ క్యారెక్టర్ను ఎఫర్ట్ లెస్గా పెర్ఫార్మ్ చేశారు.
ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో హ్యాపీగా ఉన్నారా?
వెరీ హ్యాపీ. ఇండియన్ సూపర్ స్టార్ సినిమాల్లో ఉండే క్వాలిటీ గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. దాదాపు 150 మంది వీఎఫ్ఎక్స్ నిపుణులు గత ఆరు నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
అజినీష్ లోక్నాథ్ మ్యూజిక్ గురించి..?
-ఈ కథ అనుకున్న వెంటనే ఫైనల్ చేసిన ఫస్ట్ టెక్నీషియన్ అజినీష్. దానికి కారణం ‘కాంతార’. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రార్డ్డినరీగా ఉంటుంది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అజినీష్ మ్యూజిక్.
డైరెక్టర్ అశోక్ గురించి..?
-అశోక్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన్ను డైరెక్టర్ చేయాలనే ‘ఓదెల’ సినిమా తీశాం. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా తీశాడు.
హెబ్బా పటేల్ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఎలా ఉంటుంది?
-సెకండ్ పార్ట్లో హెబ్బా క్యారెక్టర్ ఉంది. సెకండ్ హాఫ్లో చాలా పెద్ద ఎపిసోడ్ చాలా క్రూషియల్గా ఉంటుంది.
ఇలాంటి కథ రాయాలని ఆలోచన మీకు ఎప్పట్నుంచి ఉంది?
-ఇలాంటి కథ రాస్తానని నేను అనుకోలేదు. ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నంద’ లాంటి కథలు చేసుకుంటూ వెళుతున్నాను. రెండు మూడేళ్ల క్రితం నాకు ఇంత అవగాహన కూడా లేదు. నా వైఫ్ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఎనిమిది ఏళ్లవుతోంది. తను ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటుంది. కొన్ని పుస్తకాలు కూడా చదివాను. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయేమో..! ఈ సినిమా రూపంలో బయటికి వచ్చాయి.
నిర్మాత మధు గురించి..?
ఆయన చాలా పాషన్ ఉన్న నిర్మాత. ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు నచ్చితే వెంటనే చేద్దాం అంటారు. ఈ సినిమాను కాశీలో లాంచ్ చేద్దామని చెప్పాను.. మరో ఆలోచన లేకుండా ఖర్చు గురించి ఆలోచించకుండా లాంచ్ చేశారు. కుంభమేళాలో టీజర్ లాంచ్ చేయడం ఆయన ఫ్యాషన్తోనే సాధ్యపడింది. ఒక సంకల్ప బలంతో ఈ సినిమా చేశాం.
ట్రైలర్లో ‘అరుంధతి’ పశుపతి ఛాయలు కనిపించాయి..?!
ట్రైలర్లో అలా అనిపించొచ్చేమో కానీ సినిమాలో చూసుకుంటే ‘అరుంధతి’కి ఈ సినిమాకి పోలిక లేదు. ఈ రెండూ కూడా దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. ఇది ఒక ప్రేతాత్మకు పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధం. సినిమాలో విజువల్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతినిస్తాయి.
వశిష్ట సింహ గురించి..?
వశిష్ట వాయిస్ చాలా బాగుంటుంది. పార్ట్ వన్లో ఆయన వాయిస్ వినే క్యారెక్టర్కు డబ్బింగ్ చెప్పమని అడిగాను. ఈ సినిమాలో కూడా తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ సినిమాకు మూడో భాగం ప్లాన్ చేస్తున్నారా?
ఇలాంటి సినిమాలకు మనం ఏదీ ప్లాన్ చేయలేం. అవన్నీ కూడా దేవుడు ప్లాన్ చేయాలనే భావిస్తాను. ఇది ఆ కాలభైరవుడే రాయించాడనే భావిస్తున్నాను.
శర్వానంద్తో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది..?
అది వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని చేస్తున్న సినిమా. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక గ్రామం ఉంది. ఆ ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు దాన్ని ఫిక్షన్గా మార్చి చేస్తున్నాం. 1960లో జరిగిన కథ.