హైదరాబాద్,(విజయక్రాంతి): కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఆరోపించారు. సర్వే పత్రంలో అనేక అంశాలు ఉండడంతో చాలా మంది సర్వేలో పాల్గొనలేదని, గ్రేటర్ పరిధిలో దాదాపుగా 30 శాతం మంది పాల్గొనలేదని తెలుస్తోందన్నారు. సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్క తగ్గినట్టు ప్రచారం జరుగుతోందని తలసాని అన్నారు. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో వెనకబడిన వర్గాలది కీలకపాత్ర అని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు వెనకబడి ఉన్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. బీసీలు తమ హక్కుల కోసం ఎన్నో దశబ్ధాలుగా పోరాడుతునే ఉన్నారని, ప్రభుత్వం చేయించిన కులగణన సర్వేపై కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. గడిచిన 15 ఏళ్లల్లో బీసీల జనాభా అంతగా పెరగలేదని, ఎస్సీల జనాభా, ముస్లీంల జనాభా తగ్గినట్లు సర్వే చెప్తోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.