22-02-2025 01:09:29 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గాలకు సన్మానం
పటాన్ చెరు, ఫిబ్రవరి 21 : పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, సమయం వచ్చినప్పుడు ప్రజలే తిరిగి అవకాశం ఇస్తారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలకవర్గాలన సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో నూతనంగా ఏర్పడిన అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుని అభివృద్ధి చేశామ న్నారు. ప్రతి పాలకవర్గ సభ్యుడు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారని అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, తొంట అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లలిత సోమిరెడ్డి, రోజా బాల్ రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు దేవానందం, రవీందర్ రెడ్డి, యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సోమిరెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, అఫ్జల్, పాండు, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.