calender_icon.png 28 October, 2024 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలేజ్ కోర్టులపై త్వరగా నిర్ణయం తీసుకోండి

16-07-2024 01:06:45 AM

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి

తెలంగాణ హైకోర్టు రిజస్ట్రార్ జనరల్‌కు లేఖ

హైదరాబాద్ , జులై 15(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న విలేజ్ కోర్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రిజస్ట్రార్ జనరల్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి సోమవారం లేఖ రాశారు. పేదలకు ఖర్చులేని న్యాయం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర లా కమిషన్ సూచనల మేరకు 2008లో గ్రామ న్యాయాలయాల చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నా రు. కొన్ని రాష్ట్రాల్లో విలేజ్ కోర్టులను నిర్మించినా.. అప్పటి ఉమ్మడి ఏపీలో గానీ, తర్వాత తెలంగాణలో గానీ నిర్మించలేదని చెప్పారు.

అయితే, ఈ విషయాన్ని 2019లో తాము తెలంగాణ న్యాయ విభాగం దృష్టికి తీసుకురాగా.. నాడు 55 విలేజ్ కోర్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 2020లో 55 మంది న్యాయాధికారులు, 225 మంది సిబ్బందిని నియమించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. నియామకాల కోసం ఫైల్‌ను హైకోర్టుకు పంపారని, నాలుగేళ్లుగా ఆ దస్త్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. నియామకాలపై త్వరగా స్పందించాలని కోరారు. కాగా, పద్మనాభరెడ్డి లేఖపై హైకోర్టు రిజస్ట్రార్ స్పందించారని, ఆ విషయం తమ ఆలోచననలో ఉందని బదులిచ్చినట్టు పద్మనాభరెడ్డి వెల్లడించారు.