03-04-2025 01:04:52 AM
ఖమ్మం, ఏప్రిల్ 2 (విజయక్రాంతి ):- రాజీవ్ యువ వికాసం పథకాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం సరఫరాపై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆన్ లైన్ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని లేదా ఎంపీడీవో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ యూనిట్లు లభిస్తాయని అన్నారు.
అభ్యర్థులకు వ్యవసాయేతర యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ళ వయస్సు ఉండాలని, వ్యవసాయ యూనిట్లకు 60 సంవత్సరాల వరకు సడలింపు ఉందని కలెక్టర్ తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆధాయ ధృవీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రంతో కలిపి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు వెంటనే 3 రోజులలో జారీ చేసేలా తహసీల్దార్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇంచార్జ్ ఇడి నవీన్ బాబు, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎన్ విజయలక్ష్మీ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.