కలెక్టర్ వల్లూరు క్రాంతిని కోరిన తెల్లాపూర్ వాసులు
పటాన్ చెరు, ఫిబ్రవరి 7 : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణరావు వెంచర్ లో చోటుచేసుకుంటున్న కబ్జాలపై విచారణ జరపాల్సిందిగా సీఎం, మంత్రులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుక్రవారం ఫిర్యాదు చేశారు.
కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. సమావేశం అనంతరం సర్వే నంబర్ 324 లోని నారాయణరావు లేఅవుట్ లోని ఏ బ్లాక్ లో ప్రభుత్వ భూమి కబ్జాలపై స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కబ్జాలపై మున్సిపల్,
రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో రాష్ర్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లుగా కలెక్టర్ కు స్థానికులు వివరించారు. ఫిర్యాదు పై విచారణకు ఆదేశించిన మంత్రి ఆదేశాలను సైతం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బుట్ట దాఖలు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
తెల్లాపూర్ మున్సిపల్ అధికారులు సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సైతం లెక్కచేయడం లేదని కలెక్టర్ కు వివరించారు. గతంలో ముప్పు కన్స్ట్రక్షన్ కంపెనీ నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులపై సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన విచారణ లేఖను సైతం మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని కలెక్టర్ ముందు వాపోయారు. దీనీపై స్పందించిన కలెక్టర్ ఫిర్యాదు కాపీలను తనకు వాట్సప్ చేస్తే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.