20-04-2025 12:00:00 AM
వివాహ బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి కాక ముందు వరకు ఎలా ఉన్నా.. పెళ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పనిసరి. అయితే ఈ కాలపు దంపతుల్లో ఇది కొరవడుతున్నదని చెబుతున్నారు నిపుణులు. ఒకరి మాటలు, అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం, పరిణతితో ఆలోచించలేకపోవడం.. వంటివే ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి.
అయితే వీటిని ఇలాగే వదిలేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లవచ్చు. కాబట్టి ఇలాంటి కలతల్ని దూరం చేసుకోవాలంటే.. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరిలో ఒకరు కాస్త మొండిగా ఉన్నా.. మరొకరు ఓ మెట్టు దిగితే తప్పు లేదు. ఫలితంగా గొడవలూ సద్దుమణుగుతాయి. ఎదుటివారూ మీ ఓపికను అర్థం చేసుకుని వారి ప్రవర్తనను క్రమంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.