calender_icon.png 10 October, 2024 | 1:49 AM

హైదరాబాద్‌లో తైవాన్ ఇండస్ట్రీయల్ పార్కు

09-10-2024 02:09:45 AM

ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమల శాఖ, టీసీసీ

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాం తి): తైవాన్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ, తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీసీసీ) ద్వైపాక్షిక సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

మంగళవారం రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐజీ) కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, టీసీసీ ఉపాధ్యక్షుడు సైమన్ లీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. తైవాన్ నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు టీసీసీ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.

తైవాన్ కంపెనీలు రాష్ట్రంలోకి ప్రవేశించడంలో టీసీసీ కీలక మాధ్యమంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఇప్పటికే రూపకల్పన జరిగింది. మార్కెట్ ఎంట్రీ అధ్యయనాలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడం, తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం లాంటి కార్య క్రమాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఇండియా అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ మన్హర్ సింగ్ యాదవ్ పాల్గొన్నారు.