calender_icon.png 30 September, 2024 | 7:00 PM

రూ.8,400 కోట్ల ఐపీవోకు స్విగ్గీ రెడీ!

16-09-2024 04:27:02 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పలు పబ్లిక్ ఆఫర్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న స్విగ్గీ లిమిటెడ్  ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీకి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను  ఈ వారమే ఫైల్ చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు కేంద్రంగా కార్యక లాపాలు నిర్వహిస్తున్న  స్విగ్గీ తన పబ్లిక్ ఆఫర్ ద్వారా 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,400 కోట్లు) సమీకరించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో ఫైలింగ్‌కు సెబీ అనుమతి కోసం కంపెనీ వేచిచూస్తున్నదని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

ఆఫర్ పరిమాణం, జారీచేసే సమయంపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని, వాటిలో మార్పులు ఉండవచ్చని వారన్నారు. 2014లో నెలకొన్న స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,50,000 రెస్టారెంట్లతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బ్యాకింగ్‌తో నడుస్తున్న స్విగ్గీ ఈ ఏడాది వివిధ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి 7.8 బిలియన్ డాలర్లు సమీకరించింది.

ఈ ఏడాదే హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన ఇండియా సబ్సిడరీని లిస్ట్ చేసేందుకు భారీ ఆఫర్ జారీచేయాలని యోచిస్తున్నది. అలాగే ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కూడా ఇండియా యూనిట్‌ను ఐపీవోకు తీసుకొచ్చి  1.5 బిలియన్ డాలర్లు సమీకరించాలని ప్రతిపాదిస్తున్నది.