భార్య, కుమార్తెను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): కూతురు తనకు పుట్టలేదని అనుమానంతో కట్టుకున్న భార్య, కన్నబిడ్డను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ హృదయ విదార క ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన గణేశ్, స్వప్న తమ ముగ్గురు కుమార్తెలతో కలిసి న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్టలో నివాసం ఉంటున్నారు. గణేశ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
అయితే, 11 నెలల వయసున్న చిన్న కూతురు తనకు పుట్టలేదని గణేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున భార్య, చిన్న కూతురును గణేశ్ గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనంతరం తాను అల్వాల్ లోని రైల్వేట్రాక్పై ఆత్యహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.