18-03-2025 09:02:24 PM
సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్పూర్తిని ఇచ్చే విధంగా తెలుగు విశ్వ విద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ద రచయిత, వైతాళికుడు 'సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభలో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్, తెలంగాణ సారస్వత పరిషత్, సురవరం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు విశ్వవిద్యాలయానికి 'సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిన ప్రభుత్వం ప్రతి ఏడాది మే 28న ప్రతాపరెడ్డి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని, దాశరధి పేరుతో పురస్కారాన్ని అందజేస్తున్న మాదిరిగానే 'సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని' కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సంయుక్త కార్యదర్శి జె.చెన్నయ్య, ట్రస్టీలు సురవరం పుష్పలత, డాక్టర్ కృష్ణవర్ధన్ రెడ్డి, డాక్టర్ కొండా లక్ష్మీకాంత రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యుజే) అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ట్రస్ట్ సభ్యులు, ప్రతాపరెడ్డి మనుమలు సురవరం అనిల్రెడ్డి, సురవరం కపిల్, సుధీర్ పాల్గొన్నారు.