12-02-2025 02:08:07 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి తమకు అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం సైతం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని ఇప్పటికే చెప్పింది.
న్యాయవాద దంపతులైన ఇద్దరినీ కోర్టు ప్రాంగణంలోనే చంపారని..దీనికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయని వామనరావు తండ్రి గట్టు కిషన్రావు తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందరూ చూస్తుండగానే ఇద్దరినీ అత్యంత దారుణంగా హత్యచేశారని, ఆ వీడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యా యని చెప్పారు.
కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపించారు. కాగా, తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని, కేసు కొట్టివేయాలని పుట్ట మధు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. మరణ వాంగ్మూలంలో ఎవరి పేరూ చెప్పలేదని.. కావాలంటే దానికి సంబంధించిన వివరాలు కోర్టుకు అందిస్తామని పేర్కొన్నారు.
మరణ వాంగ్మూలాన్ని ఇస్తామని, దీనికి కొంత సమయం కావాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందాల్ ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.