కూకట్పల్లి, సెప్టెంబర్ 20: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై దీక్షిత కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన ఎన్ సాయిగణేశ్ తన స్నేహితులతో కలిసి కూకట్పల్లి బాగ్ అమీర్లో రూమ్ను అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఉప్పల్లోని ఓ సీసీ కెమెరాల ఆఫీస్లో పని చేస్తున్నాడు. గత రెండేళ్లుగా దగ్గరి బంధువైన యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి తీరు పట్ల ఇటీవల సాయిగణేశ్లో అనుమానం పెరిగింది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో రూమ్లోని ఫ్యాన్కు టవల్తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.