- మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): సఫిల్గూడ లేక్ పార్కులో సమస్యలను పరిష్కరించి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ శ్రవణ్, అధికారులతో కలిసి శుక్రవారం వారు సఫిల్గూడ లేక్ పార్కు, దీన్దయాళ్ నగర్ నాలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్, స్థానికులతో కలిసి మేయర్, కమిషనర్కు సమస్యలను వివరించారు.
సఫిల్గూడ చెరువులోకి గుర్రపు డెక్కతో పాటు మురుగు నీరు కూడా వస్తోందని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్కు మరమ్మతులు చేయాలని కోరారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. సఫిల్గూడ లేక్ పార్కులో గుర్రపు డెక్క తొల గించడంతో పాటు పార్కును మరింత అభివృద్ధి చేసి టూరిజం స్పాట్గా తీర్చిదిద్దు తామని వెల్లడించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
డెంగ్యూ నియంత్రణకు కృషి చేయాలి: కమిషనర్
గ్రేటర్ పరిధిలో డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో ఆమె శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డెంగ్యూ నివారణలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్షణమే డెంగ్యూ హాట్ స్పాట్స్ గుర్తించి ఆయా ఏరియాల్లోని ప్రజలకు, పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రేటర్లో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జోనల్ కమిషనర్లు, శానిటేషన్, ఎంటమాలజీ, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.