calender_icon.png 21 April, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభయహస్తంతో సివిల్స్‌లో సత్తా!

12-12-2024 01:55:23 AM

  1. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులు
  2. గతంలో 135 మందికి రూ.లక్ష చొప్పున సాయం 
  3. నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): యూపీఎస్సీ మెయిన్స్-2024 ఫలి తాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సోమవారం విడుదలైన మెయిన్స్ ఫలితాల్లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారిలో 20 మంది మనోళ్లు ఉన్నారు. ఈ ఏడాదే తొలిసారిగా రాష్ర్టం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షల కు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థికసా యం అందించిన విషయం తెలిసిందే.

సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న పేద అభ్యర్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభు త్వం ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి  రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించింది.

  ఈ ఏడాది ఆగస్ట్ 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీరికి సచివాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. రాజీవ్ సివిల్స్ అభయతహస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ ఉత్తీర్ణత సాధించారు.

వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఈ సాయి శివాని, రాహుల్ శంకేషి, పోతరాజు హరిప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్, బానోతు నాగరాజునాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్‌కుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహమ్మద్ అశ్ఫాక్, తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్ధిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌కర్నూల్‌కు చెందిన గోకమల్ల ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన ఆర్ ప్రమోద్‌కుమార్, వికారాబాద్‌కు చెందిన బి ప్రహ్లాద్, జగిత్యాలకు చెందిన బురుగుపెల్లి నీరజ్‌కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జశ్వంత్‌కుమార్, అసిఫాబాద్- కుమ్రంభీం జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ మెయిన్స్ క్వాలిఫై జాబితాలో ఉన్నారు. వీళ్లందరికీ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

తెలంగాణకు గర్వకారణం: సీఎం రేవంత్

మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఒక చిరు దీపం కొండంత వెలుగును ఇస్తుంది. ప్రభుత్వం అందించిన ఒక చిరు సాయం.. ఈరోజు యూపీఎస్సీ పరీక్షలో గొప్ప ఫలితాలను ఇచ్చింది. తెలంగాణ సర్కారు సారథిగా ఇది నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది.

రాజీవ్ సివిల్స్ అభయహస్తం పేరిట సింగరేణి సహకారంతో ప్రభుత్వం చేసిన ఆర్థికసాయాన్ని అందిపుచ్చుకుని ఒకే దఫా 20 మంది తెలంగాణ పేద బిడ్డలు అఖిల భారత సర్వీసు ప్రధాన పరీక్షలో రాణించడం తెలంగాణ సమాజానికి గర్వకారణం. మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన యువతకు నా హృదయపూర్వక అభినందనలు” అని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.