03-03-2025 05:18:18 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పిఎం ఎస్ఆర్ఐ) కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్) విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వన్ డే కిసాన్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా నీటిని నిల్వ చేసే విధానాలను, పొలాలలో నాటు వేయడం, దున్నడం, పండిన పంటను కోయడం, ధాన్యాలు దంచే పరికరాలను, మట్టితో కుండలు తయారు చేసే నైపుణ్యాలను ప్రత్యక్షంగా సందర్శించి ఆ పనిలో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ మాట్లాడుతూ... విద్యార్థులు ప్రత్యక్ష అనుభవంతో నేర్చుకోవడంతో మరింత విజ్ఞానవంతులుగా తయారవుతారన్నారు.
క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు మెరుగైన జ్ఞానాన్ని అందించడానికి దోహద పడుతుందని, దీనికోసమే ప్రభుత్వ పాఠశాలలు తోడ్పడతాయన్నారు. కర్షకుల గొప్పతనాన్ని, దేశానికి వెన్నుముక అయిన రైతు పడే శ్రమను గుర్తిస్తూ, దేశానికి, మానవాళికి రైతు అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు గ్రహించారని తెలిపారు. క్షేత్ర పర్యటనలో విద్యార్థులు ఆధ్యంతం కేరింతలతో, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.