13-03-2025 01:25:37 AM
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : మరో వారం రోజుల్లో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి కి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం బంగారి గూడ మోడల్ స్కూల్ ను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్నం భోజనం నాణ్యత ప్రమాణాలు, మెనూ ప్రకారం ఈ రోజు చేస్తున్న వంటలను పరిశీలించారు.
కిచెన్, స్టోర్ రూం లను సందర్శించి, బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. సామగ్రి నాణ్యత పరిశీలించి, కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.
పంట సాగుకు కరెంటు కోతలు లేకుండా చూడాలి..
క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిన కలెక్టర్
తాంసి, మార్చ్ 12 : వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలో గృహా, వ్యవసాయ సాగుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా పై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రైతులు సాగు చేస్తున్న జొన్న పంటను కలెక్టర్ బుదవారం పరిశీలించి, పంటలకు సాగు నీరు అందక ఎండిపోతున్న తీరును, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అనే అంశాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాంసి మండలంలో క్షేత్ర సందర్శన నిమిత్తం హాస్నపూర్ గ్రామానికి చెందిన దర్శనాల రవి కిరణ్ సాగు చేస్తున్న సుమారు 5 ఎకరాల లోని జొన్న, అర ఎకరంలో కూరగాయల పంటలను పరిశీలించారు. బోరు బావి ద్వారా సాగు చేస్తున్న జొన్న పంటలో నీటి ఎద్దడి కారణంగా పంట కొంత బాగం ఎండి పోతున్నట్లు రైతు కలెక్టర్ వివరించారు. కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందజేయలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.