calender_icon.png 24 October, 2024 | 4:04 AM

పీఈటీ వేధింపులు.. విద్యార్థుల నిరసన

12-09-2024 10:39:53 AM

రాజన్నసిరిసిల్ల: సిరిసిల్లలో ఓ పీఈటీ వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు నిరసన తెలిపారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఆమె తమ పట్ల అరాచకంగా ప్రవర్తిస్తోందని, గురువారం ఉదయం విద్యార్థులు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

పీఈటీ జోష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీఈటీ తమను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ, ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని ఆరోపించారు. స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ, రక్తం వచ్చేలా కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈవో, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పినా నిరసన విరమించక పోవడంతో ఎంఈవో రఘుపతి అవుట్ సోర్సింగ్ లో కొనసాగుతున్న పీఈటీ జోష్ణను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలపడంతో నిరసన విరమించారు.