బెల్లంపల్లి (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిన్నలా మండలం కృష్ణపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గొడుగులు పట్టుకొని మరి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒక విద్యార్థి విద్యుత్ షా క్ కు గురై తన రెండు చేతులు కోల్పోయి అచేతన స్థితిలో ఉన్నాడు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు హై స్కూల్ తరగతి గదుల పైకప్పు భాగం నాని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకొని పైకప్పుకు మరమ్మతులు జరిపించి తమ ఇబ్బందులు తీర్చాలని హై స్కూల్ విద్యార్థులు వేడుకుంటున్నారు.