calender_icon.png 28 September, 2024 | 2:43 PM

నిందితుడిని ఉరితీయాలి: విద్యార్థుల డిమాండ్

28-09-2024 12:28:26 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితున్ని ఉరితీయాలని తోటి విద్యార్థులు ఆందోళన బాట పట్టిన సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని బడి ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బొమ్మేన  సాగర్ అమ్మాయిని ఎత్తుకొని వెళ్లి ఇంట్లో అమ్మాయిపై అత్యాచారం చేయడం కలకలం రేపింది. బాలికను ఇంట్లోకి తీసుకుని వెళుతున్న సమయంలో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తలుపులు కొట్టినప్పటికీ నిందితుడు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వెళ్లారు. బాలికను జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థినిపై జరిగిన సంఘటనతో శనివారం విద్యార్థినులు నేషనల్ హైవే పై రాస్తారోకో నిర్వహించి నిందితుని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిపై క్రూరమృగంలాగా అఘాయిత్యానికి పాల్పడ్డ సంఘటనతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ ఆరోపించారు.

నిందితునికి శిక్ష పడే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. పూర్తి విచారణ చేపట్టి క్రూర మృగంలా వ్యవహరించిన నిందితున్ని పై ఫోక్సో ,నిర్భయ చట్టాలతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ హైవే పై విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక సీఐ సతీష్ అక్కడికి చేరుకొని నిందితునికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని  ఆందోళనను విరమించాలని విద్యార్థులను సముదాయించారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించి పాఠశాలకు వెళ్లారు.