05-03-2025 12:36:27 AM
సెంటర్ల వద్ద (163) బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మార్చి 4(విజయక్రాంతి): ఈనెల 5 నుంచి 23 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు మంగళవారం జిల్లా కేంద్రంలో, కొల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలకు 30 సెంటర్లలో ఇంటర్ మొదటి సంవత్సరానికి 6066 మంది, రెండవ సంవత్సరానికి 6418 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఇందులో జనరల్ 11408 మంది , ఒకేషనల్ 1026 మంది మొత్తం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం, ఒకేషనల్ మొత్తం కలిపి 12484 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు.
పరీక్ష నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల నియమ నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు, కుర్చీలు, తాగునీరు, మూత్రశాలలు, సీసీ కెమెరాల పనితీరు, తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా తదితరాల వంటి సౌకర్యాలను పర్యవేక్షించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలకు అనుమతించరాదన్నారు. పరీక్షలు నిర్వహించే ఏరియాలలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పోలీస్ ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలని సంబంధిత అధికారు లకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొల్చారం తహసిల్దార్ గఫార్, సిబ్బంది పాల్గొన్నారు.