22-04-2025 01:51:54 AM
మహేశ్వరం, ఏప్రిల్ 21: మత్తు ఇంజక్షన్లు, మత్తుమాత్రలు తీసుకున్న ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడి స్నేహితులు ఇద్దరు ప్రాణాపాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుల్తాన్పూర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ నాసర్(17) ఎంఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఇదే ప్రాంతానికి చెందిన షాభాష్(22), మరో 17 సంవత్సరాల విద్యార్థి, నాసర్ ముగ్గురు స్నేహితులు. గత కొన్నాళ్లుగా ఈ ముగ్గురు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. కొన్నాళ్లుగా షహీన్నగర్ కు చెందిన సాహిల్ అనే యువకుడు వద్ద గుర్తు తెలియని మాత్రలు, ఇంజక్షన్లను కొని నిర్మానుష ప్రదేశాల్లో వాటిని ఉపయోగించేవారు. ఇలా రెండు మూడు నెలలుగా మత్తు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 17వ తేదీన మత్తు ఇంజక్షన్లు, మాత్రలను కొని నిర్మాణుష్య ప్రదేశంలో ఇంజక్షన్లు ఎక్కించుకుని, మాత్రలు వేసుకున్నారు. అనంతరం ఒక్కసారిగా ముగ్గురూ స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన స్థానికులు నాసర్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మరో ఇద్దరిని ఓవైసీ వైద్యశాలలో చేర్పించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న నాసర్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారు. మృతు డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థులకు మత్తుపదార్థాలు, ఇంజక్షన్లు ఎవరు ఇచ్చేవారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.