శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: హాస్టల్ 5వ అంతస్తు కిటికీలో నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన శివకుమార్రెడ్డి (17) మాదాపూర్లోని నారాయణ కాలేజీ వర్మ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, మంగళవారం రాత్రి స్నేహితులు అంతా కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే, మెయిన్ గేట్కు తాళాలు వేసి ఉండడంతో కిటికీలో నుంచి గ్రిల్స్ పట్టుకొని కిందికి దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో శివకుమార్రెడ్డి ముందుగా కిందికి దిగేందుకు ప్రయత్నించి జారిపడిపోయాడు. గమనించిన స్నేహితులు భయపడి తమ ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కి వచ్చి విషయాన్ని హాస్టల్ వార్డెన్కు చెప్పారు.
శివకుమార్రెడ్డి వద్దకి వెళ్లి చూడగా తీవ్రగాయా లయ్యాయి. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, విద్యార్థి మృతిచెందిన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగాయి. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే శివకుమార్రెడ్డి మృతిచెందాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.