కొట్టి కిందకు తోసేశారని తల్లిదండ్రుల ఆరోపణ
ఖమ్మం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఖమ్మం పోలీస్కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో సోమవారం ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కోదాడ మండలం గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టిపల్లి లోకేష్(16) ఖమ్మం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి కళాశాల రెండో అంతస్తు పైనుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అయితే తల్లిదండ్రులు కళాశాల యాజమాన్య వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం అర్ధరాత్రి తమ కుమారుడు కళాశాల భవనం పైనుంచి కింద పడ్డాడని, కాళ్లు విరిగాయని ఎవరో ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. తాము వెంటనే కళాశాల వద్దకు వచ్చామని, అక్కడ యాజమాన్యం ఎవరూ అక్కడ లేరని చెప్పారు. తమ కుమారుడిని కొట్టి, కిందకు తోసి ఉంటారని ఆరోపించారు. ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో కూడా ఈ కళాశాలలో విద్యార్థులు మృతి చెందినా అధికారులెవరూ పట్టించుకోలేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.