14-03-2025 12:00:00 AM
సింగరేణి సైలో బంకర్ వద్ద దీక్షల శిబిరాన్ని సింగరేణి అధికారులతో కలిసి సందర్శించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్
సత్తుపల్లి, మార్చి 13 ( విజయక్రాంతి ): అతి త్వరలోనే సింగరేణి సైలో బంకర్ సమస్య కు పరిష్కారం లభిస్తుంది కనుక కిష్టారం గ్రామస్తులు ఆందోళనను విరమించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు. కిష్టారం, అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజల ప్రాణాలు తీస్తున్న సింగరేణి సైలో బంకర్ ను తక్షణమే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ కిష్టారం, అంబేద్కర్ నగర్ కాలనీ గత 32,రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ దయానంద్ గురువారం దీక్షా శిబిరాన్ని సింగరేణి డైరెక్టర్ పా వెంకటేశ్వర్లు , జీయం తో కలిసి సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు.
సైలో బంకర్ కాలుష్యం వల్ల ఇప్పటికే ఎంతో మంది అనారోగ్యం తో మృత్యువాత పడ్డారని, తక్షణమే బంకర్ ను తొలగించి, ప్రజల ప్రాణాలు కాపాడాలని కిష్టారం ప్రజలు ఈ సందర్బంగా సింగరేణి డైరెక్టర్ కు మొర పెట్టుకున్నారు.ఈ సమస్య గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి సీయం కు వివరించడం జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని, ఆందోళన విరమించాలని దయానంద్ దీక్ష చేస్తున్న వారిని కోరారు. సైలో బంకర్ ను ఎత్తి వేయడం లేదా బాధిత ప్రజలకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఒక వేళ న్యాయం జరగకపోతే తామే ముందుండి పోరాటం చేస్తామని వారికీ దయానంద్ స్పష్టం చేశారు.