calender_icon.png 19 April, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుందుడుకు చర్యలు ఆపండి!

17-04-2025 02:08:35 AM

సుప్రీం కోర్టు చెప్పినట్టు ఆ వంద ఎకరాల్లో మొక్కలు నాటండి

  1. బోఫోర్స్ నుంచి ‘హెరాల్డ్’దాక కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతే
  2. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభు త్వం దుందుడుకు చర్యలను ఆపాలని, తప్పును ఒప్పుకోవాలని.. కోర్టుముందు వితండవాదాలు చేయవద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు..

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడకుం డా ఆ భూమిలో సుప్రీంకోర్టు చెప్పినట్లు మొక్కలను నాటే పని చేపడితే బాగుంటుందన్నారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్లు పెట్టి చెట్లను నరికిన ఘటనలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేవని తెలిపారు. పోలీసు బందోబస్తు పెట్టి వంద ఎకరాల్లో చెట్లు నరకడం.. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అద్దం పడుతోందన్నారు.

సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పిందో..ప్రధాని మోదీ కూడా ఇదే మాట చెప్పారని.. చెట్లు నరకడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారన్నారు. కంచ గచ్చిబౌలిలో జింకలు చనిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

వాల్టా చట్టం కింద చెట్టు నరకాలన్నా సర్కార్ అనుమతి తీసుకోవాలని వంద ఎకరాల్లో చెట్లు నరికేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూములు అమ్ముతున్నారా లేదా.. ఉపాధికల్పన జరుగుతున్నదా అనేది కాదని.. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దన్నది తమ ఆలోచనగా వెల్లడించారు. 

ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా కాంగ్రెస్ తీరు..

దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం బోఫోర్స్, 2జీ, బొగ్గు కుంభకోణం.. వంటి ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ వేలకోట్లు కొల్లగొట్టాలని చూస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.. స్వాతంత్య్ర సమరయోధులు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించుకున్నారని..

కానీ దొడ్డిదారిన  రాహుల్, సోనియాగాంధీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ పత్రిక ఆస్తులను బదలాయించుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ పార్టీ ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద విశ్వాసం ఉంటే ఈ విధంగా ధర్నాలు చేయరని అన్నారు.

నెహ్రూ కుటుంబానికి, దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనే ఉద్దేశమే లేదని తెలిపారు. బోఫోర్స్ కుంభకోణం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమేనన్నారు. రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడం, దేశాన్ని అవినీతి మయంగా మార్చిందన్నారు. ఈ కేసు ఇవాళ వచ్చింది కాదని..కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు..

2012 నవంబర్ 1వ తేదీన..మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. అందులో స్పష్టంగా సోనియా, రాహుల్ పైన.. యూపీయే హయాంలోనే.. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి మళ్లించుకున్నారని దాఖలు  చేశారని అన్నారు. ఇవి పత్రికకు సంబంధించిన ఆస్తులని.. కాంగ్రెస్ పార్టీ ఈ పత్రికకు రూ.90కోట్ల రుణం ఇస్తే దాన్ని రూ.50లక్షల కోసం మళ్లీ రియల్ ఎస్టేట్ కంపెనీకి దారి మళ్లించారని ఆరోపించారు.

సోనియా, రాహుల్ నేతృత్వం వహిస్తున్న కంపెనీ ఎలా వీటిని స్వాధీనం చేసుకుందో కోర్టులో సుబ్రమణ్యస్వామి వివరించారని అన్నారు. ఈ కేసును కొట్టేయాలని రాహుల్, సోనియా హైకోర్టుకు వెళ్తే.. కోర్టు కొట్టేసిందన్నారు. దర్యాప్తు జరగాలని స్పష్టం చేసిందన్నారు. 2016లో సుప్రీంకోర్టు కూడా సోనియా, రాహుల్ అభ్యర్థనను తోసిపుచ్చిందన్నారు. మోదీ ప్రధాని అయ్యాకే ఈ కేసులు బయటకు వచ్చినట్లు..

సోనియా, రాహుల్, కాంగ్రెస్ నేతలు సుద్దపూసలు అయినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టుల పరిధిలోకి వెళ్లిన అంశం కేంద్రం చేతుల్లోనో..దర్యాప్తు సంస్థల చేతుల్లోనే ఉండదన్నారు. కోర్టుకు, ఈడీకి సహకరించాల్సింది పోయి..దబాయించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ఈడీ కార్యాలయాలు, కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినంత మాత్రాన..

వారి అవినీతి, అక్రమాలు సమసిపోవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు నేషనల్ హెరాల్డ్‌లో షేర్ హోల్డర్లుగా ఉండేవారని వారి స్థానంలో ఇవాళ నకిలీ గాంధీలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు.