19-02-2025 12:35:38 AM
వికారాబాద్, ఫిబ్రవరి 18: రానున్న వేసవిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సిఎస్ శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుదీర్ , తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లా అధికారుల తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రైతు భరోసా పథకం క్రింద అర్హులైన అందరికీ పథకం అందించే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామని, రేషన్ కార్డుల కొరకు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి వెంటనే అర్హులైన వారందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.