calender_icon.png 16 October, 2024 | 4:01 PM

హైడ్రాపై యథాతథస్థితి

16-10-2024 03:40:08 AM

చట్ట ప్రకారమే హైడ్రా చర్యలు చేపట్టాలి

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

చట్ట వ్యతిరేక కూల్చివేతలపై పరిహారం కోరవచ్చు 

పిటిషనర్లకూ సూచన

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): హైడ్రా చర్యలపై యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని సోమవారమే ఉత్తర్వులు జారీ చేసినట్టు హైకోర్టు వెల్లడించింది. స్టేటస్కో ఆర్డర్ తర్వాతా హైడ్రా కూల్చి వేత చర్యలు తీసుకోదని వ్యాఖ్యానించింది. హైడ్రా తీసుకునే ఏ చర్యలైనా చట్ట ప్రకారమే ఉండాలని వెల్లడించింది.

హైడ్రా ఏర్పాటు జీవోను సవాల్ చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపే సమయంలో స్టేటకో అర్డర్స్ అమలు చేయాలని తేల్చి చెప్పింది. ఒకవేళ హైడ్రా ప్రైవేట్ పట్టా భూముల్లోకి చొరబడి చట్ట వ్యతిరేకంగా నిర్మాణాలను కూల్చివేస్తే బాధితులు షూట్ వేసుకోవచ్చునని, నష్టపరిహారం కోరే హక్కు కూడా ఉందని స్పష్టంచేసింది.

సంగారెడ్డి జిల్లాలోని రెండు వేర్వేరు భూముల్లోని నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ, హైడ్రా ఏర్పాటు జీవో 99ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు ఇతర ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.  

హైడ్రా ఏర్పాటుకు జారీ చేసిన జీవో 99కి చట్టబద్ధత లేదంటూ హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన డీ లక్ష్మి, మల్కాజిగిరికి చెందిన ఎండీ అహ్మద్ అజీమ్ వేర్వే రుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండ లం ఐలాపూర్ లోని సర్వే నంబర్ 119/21, 119/22లో 19.27 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిలోకి హైడ్రా అధికారులు చొరబడి కూలీల విశ్రాంతి కోసం నిర్మించిన గదులను కూల్చేశారని లక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అదే మండలంలోని కిష్టారెడ్డిపేటలో సర్వే నంబర్ 133/ఎఎ, 133/ఈఈల్లోని 838.89 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలను ఏకపక్షంగా నోటీసు కూడా ఇవ్వ కుండా కూల్చేశారని అజీమ్ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు టీ సుధాకర్‌రెడ్డి, జే విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ పట్టా భూముల్లోకి హైడ్రా చొరబడి దౌర్జన్యంగా కూల్చివేత చర్యలకు పాల్పడిందని అన్నారు.

ప్రభుత్వ జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చెల్లదన్నారు. రాజ్యాంగంలోని 14, 21, 300ఎ అధికరణాలకు వ్యతిరేకమని వాదించారు. గత నెల 3న ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేసిందన్నారు. ఉదయమే పోలీసు బలగా లతో వచ్చిన హైడ్రా అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారని ఆరోపించారు.

జీవో 30 ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్‌ఎంసీ చట్టానికి విరుద్ధమని చెప్పారు. ప్రైవేట్ పట్టా భూముల్లోకి చొరబడి వచ్చే అధికారం హైడ్రాకు ఎక్కడ ఉందని నిలదీశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు.. హైడ్రా ఏర్పా టు జీవో 99ను సవాల్ చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

హైడ్రా చట్ట వ్యతిరేక చర్యలు, హైడ్రా ప్రైవేట్ పట్టా భూముల్లోకి వచ్చి కూల్చివేతల వ్యవహారాలపై విచారణ చేస్తామని తెలిపింది. నిజాం కాలం నాటి తెలంగాణ రెవెన్యూ చట్ట ప్రకారం చెరువులు, కుంటల పరిరక్షణకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ల్లో నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపునకు ఏవిధమైన నోటీసులు జారీచేయాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఇలాంటి వ్యవహారా లపై భూములు, చెరువుల సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు అధికారం ఉందని గుర్తు చేసింది. చట్ట ప్రకారం హైడ్రా ఏర్పా టు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని అభిప్రాయపడింది. నాటి రెవెన్యూ చట్టానికి అనుగుణంగానే ఇరిగేషన్ చట్టం కూడా రూపొందిందని వివరించింది.

ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ల రక్షణకు చర్యలు తీసుకో వాలని ఒక కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిందని గుర్తుచేసింది. అయినా ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకుని.. జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ వెలువడిందని, పిటిషన్లపై విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

భయాందోళనలతో పిటిషన్లు వేశారని చెప్పగానే కల్పించుకున్న న్యాయమూర్తి.. హైదరాబాద్ పరిసరాలకు పరిమితమైన హైడ్రా గ్రామాలకు కూడా వస్తుందనే భయంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆక్రమణల తొల గింపు చర్యలు కూడా చట్ట నిబంధనలకు లోబడే ఉండాలని తేల్చి చెప్పారు. విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

‘మూసీ‘ బాధితుల కేసులో కఠిన చర్యలు వద్దు

మూసీ ప్రాంతంలోని తమ ఇళ్లపై ఎర్ర అక్షరాలతో ఆర్బిఎక్స్ అని మార్కిం గ్ చేయడంతో భయాందోళనలకు గురైన పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవా రం విచారించారు. పిటిషనర్ల ఆస్తుల విషయంలో చట్ట నిబంధనలకు అనుగుణం గా అధికారులు వ్యవహ రించాలని ఆదేశించారు.

పేట్లబుర్జు ప్రాంతానికి చెందిన ఎస్ మహేందర్ సింగ్ సహా 15 మంది హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా, మున్సిపల్, రెవెన్యూ అధికారులు తమ ఇళ్లను కూల్చివేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మూసీ నది ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఆ భూమి ఉందని అధికారులు సర్వే చేసి పిటిషనర్ల ఇళ్లపై ఎర్ర రంగుతో మార్కింగ్ చేశారు.

మూసీ నది బఫర్ జోన్ పరిధికి వెలుపల పిటిషనర్ల ఇళ్లు ఉన్నాయని, మూసీ ప్రవాహ ప్రాం తం చుట్టూ నిజాం కాలంలోనే నిర్మించిన సరిహద్దు గోడకు వెలుపల ఉన్నాయని న్యాయవాది విజయలక్ష్మి వాదించారు. మహేందర్ సింగ్ ఈ ప్రాంతంలోని గురుద్వార్, హనుమాన్ ఆలయానికి సంరక్షకుడుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

నిజాం ప్రభుత్వం ఇచ్చిన భూమి లో గత 80 ఏండ్లుగా నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. వాదనల తర్వాత న్యాయమూర్తి, పిటిషనర్ల విషయంలో ప్రభుత్వ అధికారుల చర్యలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని ఆదేశించి పిటిషన్లపై విచారణ ముగించారు.