calender_icon.png 26 October, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రాజెక్టుల అప్పులతో రాష్ట్రానికి భారం

18-09-2024 12:08:49 AM

వడ్డీని తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకునాలి

ఢిల్లీ వాటర్ వీక్ సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ఆర్థిక భారంగా మారాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అప్పులపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం న్యూఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్  2024 సదస్సుకు ఆయన హాజరయ్యారు.

తెలంగాణలో సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఉత్తమ్ వివరించారు. ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.29 వేల కోట్లను సాగునీటి రంగానికి కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ర్ట ప్రభుత్వ కృషికి తోడు కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల రూపంలో సాయం అందించడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరిగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టిన సమ్మక్క-సారలమ్మ ఇరిగేషన్ ప్రాజెక్టులోని కొంత ముంపు భాగం ఛత్తీస్‌గడ్ రాష్ర్ట పరిధిలో ఉన్నందున దీన్ని పూర్తి చేయడానికి, కేంద్రం నుంచి క్లియరెన్సులు రావాలంటే ఆ రాష్ర్టం నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉందన్నారు. ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్‌తో చర్చించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం సైతం ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా చూడాలని మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు, పాలసీ మేకర్స్ పాల్గొన్నారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సు నేటి నుంచ నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.