రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ కథానాయికగా నటిస్తోంది. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై యలమంచి రాణి సమర్పిస్తున్నారు. జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం నవంబర్లో విడుదల కానుంది.
ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్, ’కాంతార కాంతార‘ లిరికల్ వీడియో మంచి స్పందన సాధించాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్, లిరికల్ సాంగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని ఓ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలో ఆదివారం నిర్వహించారు. ఇలా విద్యార్థుల మధ్య చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది.
ఈ వేదికపై డైరెక్టర్ గౌరీ రోణంకి పుట్టినరోజు వేడుక సైతం జరిగింది. ఈ సందర్భంగా ‘రంగస్థలం’ మహేశ్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ‘మీలో ఒకరి గురించే ఈ చిత్రం ఉంటుంది. నా స్నేహితుల్లో కూడా ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు’ అని తెలిపారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ‘మిస్టర్ ఇడియట్‘లో పాట పాడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో సినిమా కూడా అంతే పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నానన్నారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిర్మాత రవిచంద్ మాట్లాడుతూ చిన్న చిత్రానికి 2 మిలియన్ల వ్యూస్ రావడం ఆనందంగా ఉందన్నారు.
సిమ్రాన్.. శ్రీలీల కంటే పెద్ద హీరోయిన్ అవుతుందన్నారు. చాలా మంది వారసులు ఇండస్ట్రీలో స్టార్స్గా ఎదిగారని వారిని వారసత్వమే స్టార్స్ను చేయలేదన్నారు. టాలెంట్, కష్టించే తత్వమే వారిని స్టార్స్గా నిలబెడుతుందని రవి చంద్ అన్నారు.