24-03-2025 01:50:13 AM
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఆదివారం రాత్రి హైదరాబాదులో నిర్వహించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. "రాబిన్హుడ్'తో తెలుగు ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ లా భావిస్తుండడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ.. "ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మార్చి 28న మీరు చూస్తారు. ఇది నాకు శ్రీలీలకి సెకండ్ మూవీ. ఫస్ట్ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది. మా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు వస్తుంది. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు.
కేతిక తన ప్రజెన్స్ తో సర్ప్రైజ్ సాంగ్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. మా నిర్మాతలు మైత్రి నవీన్, రవి.. సినిమాకు వాళ్లే రియల్ హీరోస్. వాళ్ళు లేకపోతే మేము లేము. ఇండియాలో మైత్రి ఈరోజు టాప్ ప్రొడక్షన్ హౌస్. సినిమాని చాలా భారీగా తీశారు. దేవుడిచ్చిన తమ్ము వెంకీ. నామీద తనకు ఎంత ప్రేమ ఉందో ఈ సినిమాతో చూపించాడు. క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ ప్రజెన్స్ తో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్ళింది.
వార్నర్ క్రికెట్ లో ఎంత ఉత్సాహంగా ఉంటారో సినిమాలో కూడా అంత ఉత్సాహంగా కనిపిస్తారు. ఇందులో అతని కామియో చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. సినిమాకు ఒక హై ఇస్తుంది. సినిమా ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది" అన్నారు.
హీరోయిన్ శ్రీల మాట్లాడుతూ... "మార్చి 28న మా సినిమా వస్తుంది. మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. మైత్రి మూవీ మేకర్స్ నా హోం బ్యానర్ లా అయింది. నేను అనుకోకుండా చేసిన సినిమా ఇది.. అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది నితిన్ గారికి నాకు చాలా ఇంపార్టెంట్ మూవీ. అందరం కలిసి ప్రేమతో ఈ సినిమా చేశాం.
కేతిక అందర్నీ సర్ప్రైజ్ చేసింది. డేవిడ్ వార్నర్ ను బ్యాటింగ్ లో చూశాం కానీ నాకు షూటింగ్ లో చూసే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు వికెట్స్ అని వచ్చారు.. ఇప్పుడు టికెట్స్ అని వస్తున్నారు (నవ్వుతూ). మా సినిమాలో ఆయన భాగం కావడం చాలా ఆనందంగా ఉంది" అని తెలిపింది.
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. "నితిన్ అన్న నాకు ఫ్యామిలీ పర్సన్. నేను ఆయన దిల్ సినిమాకు ఫ్యాన్ ని. ఆయన అ ఆ సినిమాకి అసోసియేట్ గా పని చేశాను. ఇద్దరం కలిసి భీష్మ లాంటి సూపర్ హిట్ తీశాం. భీష్మ తర్వాత ఈ సినిమా చేశాం. శ్రీలీల అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నామీద నమ్మకంతో ప్రాజెక్టులోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. నీరా క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది.
కేతిక శర్మ చేసిన అదిదా సర్ప్రైజు పాట హ్యుజ్ బజ్ వచ్చింది. ఈ సినిమాలో ఓ రోల్ వుంది. ఆ రోల్ కి ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయితే బాగుంటుందని సరదాగా డేవిడ్ వార్నర్ పేరు చెప్పాను. నిర్మాత రవి సీరియస్ గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ ను ప్రాజెక్టులో తీసుకువచ్చారు. డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్ ఉంటుంది" అన్నారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "మైత్రి మూవీ మేకర్స్ నా సొంత కంపెనీ లాంటిది. వారి బ్యానర్ లో శ్రీమంతుడు, వాల్తేరు వీరయ్య సినిమాలు చేశాను. రాబిన్ హుడ్ సినిమా ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి థియేటర్లో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనర్.
ఈ సినిమాతో నితిన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ట్రాక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాని చాలా ప్రేమతో చేశాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను హీరోగా చేస్తున్న రోజులు గుర్తుకొచ్చాయి. మంచి కథ కామెడీ ఉన్న సినిమా ఇది" అన్నారు.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తో అలరించనున్న హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ.. "డేవిడ్ వార్నర్ తో స్టేజ్ ని షేర్ చేసుకోవడం డ్రీమ్ ట్రూ మూమెంట్. శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. నితిన్ స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్. శ్రీలీల వెరీ బ్యూటిఫుల్ పర్సన్" అన్నారు.
చిత్ర నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నవ్వులతోపాటు కథ ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి" అన్నారు.
మరో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. "ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి ఎంటర్ టైనర్" అన్నారు.
అతిగా విచ్చేసిన టాలీవుడ్ నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. "డైరెక్టర్ వెంకీ కుడుముల పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్. తను రెండు సూపర్ హిట్ లు తీశాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. వెంకీ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. తనది బాక్సాఫీస్ ఉడుము పట్టు. నితిన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కమ్ బ్యాక్ లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. రాబిన్ హుడ్ నితిన్ కెరియర్లో నెంబర్ వన్ సినిమాగా నిలబడబోతోంది" అన్నారు.
మరో అతిథి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. "మా టీమ్ తర్వాత నా ఫస్ట్ ఆడియన్ వెంకీ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. నితిన్, వెంకీ కాంబినేషన్ లో 'భీష్మ' బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమా కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. డేవిడ్ వార్నర్ ఆటకి పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ వేడుకలో ఉండటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
ఇంకో అతిథి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ... "వెంకీ తన సినిమాని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా స్ట్రెంత్ ఎంటర్ టైన్మెంట్.. వెంకీ అలాంటి ఎంటర్ టైన్మెంట్ తీసే దర్శకుడు" అన్నారు.
మరో గెస్ట్ డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ. "ఎంటర్ టైన్మెంట్ రాసేవాళ్ళు, తీసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఆలాంటి కొద్దిమంది దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకరు. నితిన్ కి పెద్ద ఫ్యాన్ ని. ఇష్క్ సినిమా ఎన్నోసార్లు చూస్తుంటాను. ట్రైలర్ లో డబ్బులు విపరీతంగా కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ కి కలెక్షన్ల కుంభవృష్టి కురవాలని కోరుకుంటున్నా" అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. "ఇది స్టైలిష్ కమర్షియల్ ఎంటర్ టైనర్. వెంకీ కుడుముల గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది. హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ ఉండే రాకింగ్ ఫిల్మ్ ఇది" అన్నారు. మూవీ యూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.