28-03-2025 12:05:31 AM
త్రిభాషా సూత్రంపై మాటల యుద్ధం..
ఏ భాషకు మేం వ్యతిరేకులం కాదు..
ఇది న్యాయం, గౌరవం కోసం జరుగుతున్న యుద్ధం..
చెన్నై: త్రిభాషా సూత్రంపై కేంద్రంతో తమిళనాడు సీఎం స్టాలిన్ కయ్యానికి కాలు దువ్విన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు, స్టాలిన్కు మధ్య మాటల యుద్ధం నడిచింది. త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న స్టాలిన్ వైఖరి సరిగ్గా లేదని యోగి విమర్శించారు. కాగా స్టాలిన్ యూపీ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చారు. యోగి మాటలు వ్యంగ్యంగా లేవని.. పొలిటికల్ బ్లాక్ కామెడీగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
తమిళనాడు ఏ భాషకు వ్యతిరేకం కాదు.. కానీ అహంకారంతో బలవంతంగా విధానాలను రుద్దేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మా పోరాటం చూసి భయపడుతోందని విమర్శించారు. ‘ద్విభాషా సూత్రం, డీలిమిటేషన్పై తమిళనాడు వైఖరిని దేశం మొత్తం సమర్థిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ద్వేషం గురించి పాఠాలు బోధించాలనుకోవడం హాస్యాస్పదం. ఇది ఓటు కోసం చేస్తున్న చిల్లర రాజకీయాలు కావు. ఈ యుద్ధం న్యాయం, గౌరవం కోసం జరుగుతుంది’ అని స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.